NEWS

Blogger Widgets

13.7.12

ఘట్‌కేసర్-బీబీనగర్ రూట్లో పలు రైళ్ల రద్దు


7/13/2012 2:17:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: ట్రాక్ మరమ్మతు పనుల దృష్ట్యా.. ఘట్‌కేసర్-బీబీనగర్ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా వారంలో రెండ్రోజులపాటు(మంగళ, శుక్ర) కొన్ని రైళ్ల రద్దు, కుదింపు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. వివరాలివీ.....

గుంటూరు-సికింద్రాబాద్(రైలు నంబరు: 17201) మధ్య తిరిగే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి వరకే నడుపుతారు. అక్కడి నుంచి రైలు నంబరు:17233 పేరిట సికింద్రాబాద్-బల్హార్ష మధ్య భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తుంది. వాస్తవానికి ఈ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ వల్ల భువనగిరి నుంచి రాకపోకలు సాగిస్తుంది.

సికింద్రాబాద్‌లో మంగళవారం సాయంత్రం 4:50 గంటలకు బయలుదేరాల్సిన కాకినాడ పోర్టు-సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్(17208) ఖాజీపేట-భువనగిరి మార్గంలో సుమారు 70 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది.

హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట పుష్‌పుల్ రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ అన్ని స్టేషన్లలోనూ ఆగుతుంది.

మంగళవారం సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయలుదేరాల్సిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్(15015)ను ఖాజీపేట-భువనగిరి మధ్య నియంత్రణ వల్ల 2:25 గంటలు ఆలస్యమవుతుంది.

మంగళ, శుక్రవారాల్లో ఫలక్‌నుమా-భువనగిరి మధ్య నడిచే మెము రైళ్లు రద్దవుతాయి.

బెల్లంపల్లి-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు(17012) ఖాజీపేట-పగిడిపల్లి మధ్య 2:20 గంటలపాటు నిలిపివేస్తారు.

సికింద్రాబాద్‌కు సాయంత్రం 5:10 గంటలకు చేరే రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్(57152)ను బీబీనగర్ నుంచి 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుపుతారు.

మధ్యాహ్నం 1:45 గంటలకు సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు బయలుదేరాల్సిన వికారాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3:45 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది.

సికింద్రాబాద్-హౌరా ఎక్స్‌ప్రెస్ ఘట్‌కేసర్ వద్ద పావుగంట ఆగుతుంది.