NEWS

Blogger Widgets

20.6.12

ఎన్డీయేలో అప్పుడే ‘ప్రధాని’ చిచ్చు!


    న్యూఢిల్లీ, జూన్ 19: రాష్టప్రతి ఎన్నిక విషయంలో తలెత్తిన సంక్షోభం ఒక కొలిక్కి రాకముందే లౌకికవాదే భావి ప్రధానిగా ఉండాలని ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జెడి(యు) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన బద్దవిరోధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సంధించిన బాణం బిజెపిని ఇరుకున పడేయడమే కాకుండా ఎన్డీఏలో మరోచిచ్చుకు దారితీస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ఎంపియ్యే వ్యక్తి లౌకిక వాది అయి ఉండాలని ఎన్డీయే ప్రధాన భాగస్వామ్య పక్షాల్లో ఒకటయిన జెడి(యు) నాయకుడు నితీశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి బిజెపి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్ని విధాల అర్హుడని ఆ పార్టీలోని ఒక వర్గం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎన్డీయే అభ్యర్థి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యుడై ఉండాలని చెప్పడం ద్వారా బిజెపి నాయకుడు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ సైతం నితీశ్ అభిప్రాయాన్ని సమర్థించడం విశేషం.
ప్రజలు తాము ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవడం కోసం 2014లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఎన్డీయే తన అభ్యర్థిని ప్రకటించాలని కూడా నితీశ్ గట్టిగా అభిప్రాయపడ్డారు. అయితే తాను ప్రధానమంత్రి పదవిని కోరుకోవడం లేదని స్పష్టం చేసారు. ‘బీహార్ లాంటి అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాల సమస్యలు తెలిసిన నాయకుడిని ఎన్డీఏ ఎంపిక చేయాలి. కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలకు ఆయన ఆమోదయోగ్యుడై కూడా ఉండాలి. కూటమి అభ్యర్థి లౌకిక వాదయి ఉండాలనేది నా అభిప్రాయం’ అని ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీశ్ చెప్పారు. నితీశ్‌కు, నరేంద్ర మోడీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అనేక సందర్భాల్లో వెల్లడయిన విషయం తెలిసిందే. గత లోక్‌సభ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి నరేంద్ర మోడీని బిజెపి దూరంగా ఉంచడానికి కూడా ఇదే కారణం.
ప్రజాస్వామ్య విలువల పట్ల పూర్తి నమ్మకం కలిగిన వ్యక్తి ఎన్డీయే అభ్యర్థిగా ఉండాలని నితీశ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికయిన నాయకుడికి ప్రజాస్వామ్య విలువల పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి. భారత్‌లాంటి పలు మతాలు, పలు భాషలున్న దేశంలో నాయకుడి వ్యక్తిత్వంలో లోపాలు ఉండరాదు. నాయకుడు అందరినీ కలుపుకొని పోయే వాడయినప్పుడు మాత్రమే ఒక కూటమి ఎన్నికల్లో విజయం సాధించగలదని కూడా నితీశ్ కుమార్ స్పష్టం చేసారు. అంతేకాదు, సమయం వచ్చినప్పుడు మిగతా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల వద్ద కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్తానని కూడా ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి పెద్ద పార్టీకి చెందిన వాడే ఉండాలి. మేము ప్రోత్సాహక పాత్రను మాత్రమే పోషించగలం. అయితే కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై అది అధారపడి ఉంటుంది. నాయకుడిగా ఉండే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేమిటో నేను ఇంతకు ముందే చెప్పాను అని నితీశ్ స్పష్టం చేసారు.
నితీశ్ కుమార్ అభిప్రాయాలను బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ సైతం సమర్థిస్తూ, ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి అటల్ బిహారీ వాజపేయి లాంటి ఆకర్షణ ఉన్న వ్యక్తి అయి ఉండాలన్నారు. సమాజంలోని అన్ని వార్గల వారికి ఆమోదయోగ్యుడై కూడా ఉండాలని మోడీ అన్నారు. కాగా, నితీశ్ కుమార్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు, న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సైతం స్వాగతించారు.