NEWS

Blogger Widgets

9.6.12

సునీల్ పాత్ర కీలకం

హైదరాబాద్, జనవరి 25: ఎమ్మార్ కేసులో సిబిఐ అరెస్టు చేసిన ఎన్.సునీల్‌రెడ్డిని బుధవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఫిబ్రవరి ఒకటి వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నాగమారుతి శర్మ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎమ్మార్ కేసులో అరెస్టయిన కోనేరు ప్రసాద్ జ్యుడీషియల్ రిమాండ్‌ను కూడా ఫిబ్రవరి 1 వరకు పొడిగించారు. కాగా, ఒఎంసి కేసులో నిందితులైన గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీలక్ష్మి జ్యుడీషియల్ కస్టడీని ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు. జగన్ ఆస్తుల కేసులో నిందితుడైన విజయసాయిరెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతివ్వాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న శ్రీలక్ష్మి అభ్యర్థనను కోర్టు మన్నించింది.
బుధవారం ఉదయం సిబిఐ అధికారులు బేగంపేటలోని కేంద్రప్రభుత్వ హెల్త్ సర్వీసెస్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సునీల్‌రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఎమ్మార్ కేసులో కోట్లాది రూపాయల కుంభకోణంలో సునీల్‌రెడ్డికి సంబంధం ఉందని, మరో నిందితుడు కోనేరు ప్రసాద్‌తో కలిసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. సునీల్‌రెడ్డి నివాసంలో సోదాలు చేసినప్పుడు దొరికిన డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఆయనకు ఈ కేసుతో సంబంధం ఉందని నిర్ధారించుకున్నామని పేర్కొంది. విల్లా ప్లాట్లు అమ్మకాల్లో చదరపు గజం రూ.5 వేలు డాక్యుమెంట్ ధర ఉండగా వాటిని అధిక ధరకు విక్రయించడంలో కోనేరు రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు టి.రంగారావుతో చేతులు కలిపి భారీ ఎత్తున కొనుగోలు దారుల నుంచి నగదు వసూలు చేసినట్లు సిబిఐ నివేదికలో స్పష్టం చేసింది. విల్లా ప్లాట్‌ల ధర చదరపు గజం రూ.5 వేల నుంచి రూ.50 వేలకు పెంచి విక్రయించారని పేర్కొంది. నిందితుడికి ఎమ్మార్ కుంభకోణంలో మొత్తం వివరాలు తెలుసునని, తాము విచారించినా అందుకు సహకరించలేదని సిబిఐ కోర్టుకు వివరించింది. ఈ కుంభకోణంలో సునీల్‌రెడ్డి కీలకం అయినందున లోతుగా విచారించాల్సి ఉందని సిబిఐ తెలిపింది. నిందితుడిని 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును అభ్యర్థించింది. సిబిఐ కస్టడీ పిటిషన్‌ను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ, నిందితుడికి ఫిబ్రవరి 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వైఎస్ జగన్ ఆస్తుల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ వి.విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని సిబిఐ బుధవారం ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తాము విజయసాయిరెడ్డిని విచారించినా చాలా వరకు నిజాలు వెల్లడించలేదని చెప్పారు. ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, సాక్ష్యాలకు సంబంధించి కస్టడీ సందర్భంగా విచారించినప్పుడు ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పారని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంలో నిందితుడికి చాలా అంశాలు తెలిసినా తమకు వెల్లడించలేదని ప్రస్తావించింది. ఆయన నిజాలు చెబితే తప్ప తాము ఈ అవకతవకల్లో వాస్తవాలు బయటపెట్టలేమని తెలిపింది. ఈ పరిస్థితిలో నిందితుడు విజయసాయిరెడ్డిని బెంగళూరు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో గానీ గుజరాత్‌లోని గాంధీనగర్ ఎఫ్‌ఎస్‌ఎల్‌లో గానీ నార్కో అనాలసిస్ టెస్ట్‌లు చేయించడం విచారణలో భాగంగా చాలా అవసరమని భావిస్తున్నట్లు సిబిఐ కోర్టుకు వివరించింది. ఈ వివరాలను రాబట్టేందుకు నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సిబిఐ అభ్యర్థించింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది. ఆ తేదీలోగా విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి నాగమారుతి శర్మ ఆదేశించారు.
ఒఎంసి కేసులో నిందితులకు ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ పొడిగింపు
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, రాజగోపాల్ జ్యుడీషియల్ రిమాండ్ గడువు బుధవారంతో ముగిసింది. శ్రీలక్ష్మి, రాజగోపాల్ నేరుగా కోర్టు ముందు హాజరయ్యారు. అంతకు ముందు గాలి, శ్రీనివాస్‌రెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అనంతరం ఈ నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్‌ను ఫిబ్రవరి 8 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పిటిషన్‌పై విచారణ చేసిన అనంతరం కోర్టు ఆమె విజ్ఞప్తిని మన్నించింది. ప్రత్యేక రిమాండ్ ఖైదీగా గుర్తించాలని జైళ్ళ శాఖను ఆదేశించింది.