దివానియా(ఇరాక్): ఇరాక్లోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం జరిగిన బాంబు పేలుళ్లలో 38 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు......
దివానియా నగరంలోని రద్దీగా ఉండే సెంట్రల్ మార్కెట్లో నిలిపి ఉంచిన ఓ ట్రక్కులో బాంబు పేలడంతో 26 మంది మృత్యువాతపడగా, మరో 50 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే నగరంలో కర్ఫ్యూ విధించారు.
ఈ దుశ్చర్య వెనక అల్ కాయిదా ఉగ్రవాదుల హస్తముండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ పేలుడుకు ముందు ఉదయం ఏడు గంటల సమయంలో కర్బాలా నగర శివారులోని ఫ్రెహ్యాలో రెండు కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. మరోపక్క.. దియాలా రాష్ట్రంలో జరిగిన కాల్పులు, పేలుళ్లలో నలుగురు, తాజీ, బాగ్దాద్ జరిగిన పేలుళ్లలో ఒక పోలీసు సహా నలుగురు చనిపోయారు.