NEWS

Blogger Widgets

17.6.12

ఘోర ప్రమాదం



హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలుదేరిన కాళేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సు మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఉస్మానాబాద్ జిల్లా నల్‌దుర్గ్ వద్ద శనివారం తెల్లవారుఝామున ప్రమాదానికి గురైంది. మొత్తం 50మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా, దుర్ఘటనలో 30మంది మృతి చెందినట్టు మహారాష్ట్ర అధికార వర్గాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్థారించింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ నుంచి బయల్దేరిన బస్సు (కెఏ 01 245) శనివారం తెల్లవారుఝాము మూడు గంటల ప్రాంతంలో నల్‌దుర్గ్ వద్దనున్న వంతెన వద్దకు చేరుకుంది. బస్సు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి వంతెన పైనుంచి 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయినట్టు సమాచారం. దుర్ఘటనలో 30మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారవర్గాలు వెల్లడించాయి. మృతులంతా మన రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించి, అక్కడి పోలీసులు సమాచారం అందించారు. సమాచారం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే పరిస్థితిని సమీక్షించాలంటూ చీఫ్ సెక్రటరీ పంకజ్ ద్వివేదిని ఆదేశించారు. నగరం నుంచి ప్రత్యేక అధికారుల బృందం ఘటనా స్థలానికి పయనం కావటంతోపాటు మెదక్ జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులను కూడా అక్కడకు చేరుకోవాలని ఆదేశించారు. దుర్ఘటనలో గాయాలపాలైన వారిని సమీపంలోని షోలాపూర్‌లోని అశ్విని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్టు తెలిపారు. కానీ ప్రమాదంలో తల్లిదండ్రులను కొల్పోయిన సాయిజయంత్ అనే చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడినట్టు తెల్సింది. బస్సు ప్రమాదానికి గురైనట్టు ఉదయం ఆరు గంటల సమయంలో కాళేశ్వర ట్రావెల్స్‌తోపాటు నగరవాసులకు సమాచారం అందింది. దీంతో బస్సులో షిర్డీ వెళ్లినవారి కుటుంబీకులు ఒక్కసారిగా హుటాహుటిన లక్డీకాపూల్‌లోని ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నారు. కొందరు సంబంధీకులు కంటతడి పెడుతూ ట్రావెల్స్ వారిని ప్రశ్నిస్తూ, తమవారి క్షేమ సమాచారం తెల్సుకునేందుకు ఫోన్లు చేస్తుండటం అక్కడున్న వారందర్నీ కలచివేసింది. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన 14మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం వెల్లడించిన ట్రావెల్స్ నిర్వాహకులు, మిగతావారి వివరాల్ని వెల్లడించేందుకు నానా అవస్థల పడటంతో మృతుల, క్షతగాత్రుల సంబంధీకులు ట్రావెల్స్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఎక్కువమంది మృతి చెందడానికి సహాయ చర్యలు ఆలస్యం కావడం కూడా కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా మూడు నాలుగు టికెట్లు బుక్ చేసుకున్నందున వారి వివరాల్ని సకాలంలో వెల్లడించకలేకపోయినా మధ్యాహ్నం తర్వాత ట్రావెల్స్ నిర్వాకులు జాబితా విడుదల చేశారు. అయితే మృతుల్లో నగరంలోని కెపిహెచ్‌బిలో బస్సు ఎక్కిన వారుండగా, మోతీనగర్ ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు నగరవాసులై ఉండొచ్చునని అధికారులు వెల్లడించారు. వీరితోపాటు గచ్చిబౌలీలోని టిసిఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన పధ్నాలుగు మంది ఉద్యోగులు సంపత్, సువర్ణ, మానస, ప్రసన్న, శేఖర్, దివ్య, దీప్తి, కృష్ణసాయి, ఉమ, సాహితి, పూజిత, మహిమ, సాయిసుష్మా, కృష్ణచైతన్యలు ఉన్నట్టు ట్రావెల్స్ నిర్వాహకులు వెల్లడించారు. వీరంతా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందినవారిగా గుర్తించినట్టు సమాచారం. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, సిమెంటు కర్మాగార ఉద్యోగి కృష్ణయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ బస్సులోనే షిర్డీకి ప్రయాణించినట్టు సమాచారం. మృతుల్లో వైజాగ్‌కు చెందిన కవలలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, బస్సు డ్రైవర్ తాగిన మైకంలో ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్టు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఒకరు వెల్లడించటం గమనార్హం.
అన్నప్రాసనకు వెళ్లి...!
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బొదిలీడు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, కృష్ణయ్య, సావిత్రమ్మ, రాధిక, ఆదెమ్మ, దీపికలు చిన్నారి సాయిజయంత్‌కు అన్నప్రాసన చేయించేందుకు షిర్డీ బయలుదేరారు. కూకట్‌పల్లిలో టికెట్లు బుక్ చేసుకుని వీరంతా ఇదే బస్సు ఎక్కారు. అంతకుముందే వీరు కూకట్‌పల్లిలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అయితే, దుర్ఘటనలో చిన్నారి సాయిజయంత్ మినహా మిగిలిన వారంతా మృతి చెందినట్టు తెల్సింది. వీరి మృతదేహాలకు హుస్నాబాద్‌లో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయిజయంత్‌ను బంధువులు తీసుకెళ్లినట్టు కూడా అధికారులు తెలిపారు. ఘటనలో డ్రైవర్ శేషు వెనె్నముక పూర్తిగా విరిగి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక గాయపడిన వారిలో నగరానికి చెందిన కె కృష్ణతులసి, కె వెంకటేశ్వరరావు, జి యాదగిరి, డాక్టర్ జ్యోతి సుశీల్, పాల్ జోసఫ్ (కృష్ణా), దీపిక, రాధిక (బాజుపల్లి), కిరణ్ ఉపేంద్ర (నాగర్‌కలపురం), వి సంపత్ చంద్రావతి (విశాఖపట్నం), వి కిరణ్‌కుమార్ (శ్రీకాకుళం)లు ఉన్నట్టు సమాచారం.
మృత్యుంజయుడు ‘సాయి జయంత్’!
అన్నప్రాసన కోసం చిన్నారి సాయిజయంత్‌తో షిర్డీకి పయనమైన కుటుంబ సభ్యులంతా మృతి చెందినా, సాయిజయంత్ మృత్యుంజయుడిగా దుర్ఘటన నుంచి బయటపడ్డాడు. సాధారణంగా ఆరు నెలల వయస్సున్నపుడే చిన్నారులకు అన్నప్రాసన చేయించటం సాంప్రదాయం. అన్నప్రాసన కోసం వెళ్తున్నారంటే సాయిజయంత్ వయస్సు నెలల్లోనే ఉంటుంది. దుర్ఘటన చోటుచేసుకున్న తెల్లవారుజాము మూడు గంటల సమయంలో గాఢ నిద్రలోనున్న తల్లి ఒడిలోనో, తండ్రి ఒడిలోనో హాయిగా నిద్రపోతున్నపుడు ప్రమాదం జరగడంతో కన్నవారు అప్రమత్తమై, తామేమైపోయినా సాయిజయంత్‌ను సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నించటం వల్లే చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడని వారి బంధువులు భావిస్తున్నారు