NEWS

Blogger Widgets

15.6.12

లక్ష్యాన్ని ఛేదించిన జగన్, కాంగ్రెస్ గుండెల్లో జగన్ బుల్లెట్


 YSRCP jagan, AP by poll results, jagan wins by polls, ys jagan congress, TDP jaganవై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నా కాంగ్రెస్ గుండెల్లో మంటలు రేపాడు. ఉపఎన్నికల్లో అత్యధికస్థానాలు గెలుచుకుని అధికార కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టాడు. సిబీఐ అనే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ జగన్ పై ప్రయోగించినా అది లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. దీనికి ప్రతిగా జగన్ సంధించిన సానుభూతి అస్త్రం కాంగ్రెస్ ను కళావికలం చేసింది. నేడు తగిలిన ఈ దెబ్బ రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తులో పెద్దముప్పుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండున్నర నెలల క్రితం తెలుగుదేశంపార్టీ కిరణ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మద్దతుగా వై.ఎస్. సానుభూతిపరులైన ఎమ్మెల్యేలు ఓటువేసి అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో రాష్ట్రంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. జగన్ చేస్తున్న ఓదార్పుయాత్రలకు అనూహ్య స్పందన్ వస్తుండటంతో అటు కాంగ్రెస్, ఇటు టిడిపిలు బెంబేలెత్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికలను సాకుగా తీసుకుని జగన్ పార్టీని భూస్థాపితం చేయటానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆఖరి అస్త్రంగా సిబీఐను ప్రయోగించింది సిబీఐ జగన్ ను జైలులో పెట్టినా ఫ్యానుగాలి జోరు తగ్గకపోగా, విజయమ్మ, షర్మిల రూపంలో పెద్ద తుఫానుగా మారి కాంగ్రెస్, టిడిపిలను కుదిపేసింది. రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, జగన్ దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని కాంగ్రెస్, టిడిపిలు ఊరువాడా ప్రచారం చేసినప్పటికీ ఎటువంటి స్పందన కనిపించలేదు.


గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 37.03 శాతం ఓట్లు, తెలుగుదేశంపార్టీకి 35.66 శాతం ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావటంతో ఈ ఓట్ల శాతం 51 శాతంకు పెరిగింది. దీనికి తోడు టిడిపికి ఉన్న 35.56 శాతాన్ని కూడా కలిపితే సుమారు 87 శాతం ఓట్లు ఈ మూడు పార్టీలకు వచ్చినట్లు భావించాలి. అయితే 0 స్థాయినుంచి ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బైబిల్ కథలోని డేవిడ్ అనే చిన్నకుర్రాడు తన చేతిలోని వడిశేలతో గొలియత్ అనే ఒక భీకరాకురుడిని హతం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ జగన్ అనే జూనియర్ రాజకీయనాయకుడు ఏకంగా ఇద్దరు ప్రత్యర్థులకు ఒకేసారి మట్టికరిపించాడు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బలమైన మీడియా వర్గాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాయి. సోనియాగాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తేసుకుని వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లకు ఎన్నికల ప్రచారానికి పంపింది. అలాగే టిడిపి అన్ని చోట్ల ఏరికోరి డబ్బున్నవారికే టిక్కెట్లు కట్టబెట్టింది. ఇక జగన్ ను వ్యతిరేకించే ఎలక్ట్రానిక్ ఛానల్స్, వార్తాపత్రికలు జగన్ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు గుప్పించాయి. జగన్ కు ఓటు వేస్తే ప్రజలు అవినీతిని సమర్థించినట్లేనని తీర్మానించాయి. అయినా ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణలు అందరిపైనా ఉన్నాయంటూ జగన్ కె తమ మద్దతును ప్రకటించారు.